పేద వైద్య విద్యార్థికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం

పేద వైద్య విద్యార్థికి మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం

మంత్రి కేటీఆర్ ఓ పేద వైద్య విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం అందించారు. హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో MBBS చదువుతోంది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడేళ్లలో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా వల్ల చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది.

పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్ మెన్ గా పని చేస్తున్నారు. తన డాక్టర్ విద్య కోర్సు ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది. తన పేదరిక పరిస్థితుల్లోనూ ఎంతో పట్టుదలతో.. వైద్య విద్యపై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూష కు కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు.  ఇవాళ(బుధవారం) అనూష వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు. ఆమె MBBS ఫీజుల బాధ్యత తీసుకుంటానని తెలిపిన మంత్రి కేటీఆర్.. కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలన్నారు. ఈ సందర్భంగా అనూషకి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి.. ఆమె కు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కు ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.