తెలంగాణలో భూమి బంగారమైందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఏ మూలకు పోయిన ఎకరం రూ.30 లక్షలుందని చెప్పారు. అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరిగింది. మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమప్రధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణ ఒకప్పటి కరువు సీమలు..ఇప్పుడు కోనసీమలు అయ్యాయని తెలిపారు. గతంలో కరువు నేలను సినిమాల్లో చూపించాలంటే రాయలసీమ, తెలంగాణలోని పల్లెలను చూపించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. పచ్చదనం, పాడిపంటలతో ఉండే పల్లెలను చూపించాలంటే సినిమా వాళ్లు తెలంగాణకు వస్తున్నారని అన్నారు. బలంగం సినిమాలోని పల్లె అందాలను కోనరావుపేటలో షూట్ చేశారని తెలిపారు. గ్రామాల్లో చెత్త నుంచి కూడా సంపద సృష్టిస్తున్నామని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. తమకు కట్టడం తెలుసునని.. విపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసునన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ కు కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో బతుకులు ఆగమైతే.. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం చాలా డెవలప్ అయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు విశ్వసనీయత లేదన్నారు. కర్ణాటకలో గెలిచామని తెలంగాణలో కలలు కంటున్నారు. ప్రతిపక్షంలో భట్టి విక్రమార్క వందేళ్లు ఉండాలని కోరుకుంటున్నానని కేటీఆర్ చెప్పారు.
తాము మోదీకి మేమం భయపడలేదన్నారు మంత్రి కేటీఆర్. కేంద్రం సహకరించకపోయిన రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గల్లీలో బీజేపీ తిడుతుంటే ఢిల్లీలో బీజేపీ అవార్డులు ఇస్తు్ందని చెప్పుకొచ్చారు. గుజరాత్ మోడల్ అంటే అంతా డొల్ల అని విమర్శించారు. ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని తెలిపారు.