‘‘కంటెంట్ లేని కాంగ్రెస్కు, కమిట్మెంట్ ఉన్న కేసీఆర్కు పోలికా?’’ అని కేటీఆర్ విమర్శించారు. ‘‘1956లో తెలంగాణకు, ఆంధ్రాకు ఇష్టం లేని బలవంతపు పెండ్లి చేసిన పాపాత్ములు ఎవరు? 1968లో 370 మంది పిల్లలను కాల్చి చంపిందెవరు? 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను ప్రజలు గెలిపించినా వారి ఆశయాలను తుంగలో తొక్కి, కాంగ్రెస్లో కలుపుకున్నది వాస్తవం కాదా? 2004లో మాటిచ్చి 2014 దాకా 1,000 మందిని చంపింది వారు కాదా..? ఇవాళ మళ్లీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఎవరు?” అని కాంగ్రెస్పై మండిపడ్డారు. ‘‘తెలంగాణ సాధనలో కాంగ్రెస్కు, మా పార్టీకి తేడా ఏందంటే.. ‘బ్రిటిషోళ్ల మీద భారతీయులు కొట్లాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నరు. బ్రిటిషోళ్లు మేం స్వాతంత్ర్యం ఇచ్చినం అంటే ఏమన్నా సిగ్గు ఉంటదా? చెప్పేందుకే ఎంత గలీజ్గా ఉంటది. అదొక్కటే కాదు.. నవమాసాలు మోసి ప్రసవించిన తల్లికి ఎంత బాధ ఉంటదో.. మాకు అంతే బాధ ఉంటది. మంత్రసాని పాత్ర పోషించిన వారే కాంగ్రెసోళ్లు. 1,000 మందిని పొట్టన పెట్టుకున్న బలిదేవత సోనియా అని అప్పట్లో రేవంత్రెడ్డి అన్నారు” అని దుయ్యబట్టారు.
మళ్లీ రాబందులు తిరుగుతున్నయ్
తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కొన్ని రాబందులు మళ్లీ తిరుగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. ‘‘ఇలాంటి సమయంలో మన కవి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ఒక మాటను గుర్తు చేయాలనుకుంటున్న. ‘జాగ్రత్త.. ప్రతి ఓటు మీ పచ్చి నెత్తుటి మాంసపు ముద్ద.. చూస్తూ చూస్తూ వేయకు గద్దకు. ఓటు కేవలం కాగితం మీద గుర్తు కాదు.. మీ జీవితం కింద ఎర్త్..’ అని అలిశెట్టి చెప్పారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే గందరగోళం అయిపోతారని అన్నారు. ‘‘తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధం. దాన్ని ఎవరూ మార్చలేరు. ఎవరూ తెంచలేరు. తుంచలేరు. జనం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడినొళ్లే అక్కడకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారని కేటీఆర్ అన్నారు.