కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరం

కిషన్ రెడ్డి  కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరం

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణకు అందాల్సిన వరద సాయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తప్పుడు లెక్కలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్  మండిపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్​కు తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండడం దురదృష్టకరమని విమర్శించారు. సొంత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, తెలంగాణ  ప్రభుత్వం పై అభాండలు వేసిన కిషన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రకటనలో కేటీఆర్ గురువారం డిమాండ్ చేశారు. రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మ‌‌‌‌ర‌‌‌‌ల్చేందుకు కేంద్ర మంత్రి కిష‌‌‌‌న్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని తెలిపారు. ఎలాంటి విపత్తులు లేకున్నా రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్డీఆర్ఎఫ్​ (స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్)కు వచ్చే నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దక్కింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 19వ తేదీన లోక్ సభలో కేంద్ర హోంశాఖ (మినిస్టర్ ఫర్ స్టేట్) నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను కిషన్​ రెడ్డి ఒకసారి చదవాలని కేటీఆర్​ సూచించారు. 

ఒక్క పైసా ఇయ్యలే.. 
2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్​ ద్వారా అదనంగా ఒక్క రూపాయి ఇయ్యలేదని ప్రకటించిన మాట వాస్తవం కాదా? అని కేటీఆర్​ ప్రశ్నించారు.  హైదరాబాద్ నగరం ఎన్నడూ లేని వర్షాలతో మునిగి కష్టాలు పడ్డప్పుడు రూ.3500 కోట్లు కావాలని అడిగితే కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని పేర్కొన్నారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో జరిగిన ప్రాథమిక నష్టం రూ.1,400 కోట్లని తేల్చి కేంద్రానికి నివేదించినట్లు చెప్పారు. అయితే ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ నిధులు అందించాలని కోరితే, కేవలం బృందాలను పంపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు గుజరాత్ లో  వరదలు వచ్చినప్పుడు రూ.1000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్  ప్రత్యేక అదనపు సాయాన్ని అడ్వాన్స్ రూపంలో మోడీ విడుదల చేశారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న 4 రాష్ర్టాలకు 2018 నుంచి ఇప్పటిదాకా రూ.15,270  కోట్లు ఇచ్చారన్నారు.