
హైదరాబాద్, వెలుగు: పేద విద్యార్థులకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వారి చదువు పూర్తయ్యే వరకు ట్యూషన్, హాస్టల్ ఫీజులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఫస్టియర్ ఫీజులకు సంబంధించిన చెక్కులను ఆదివారం బేగంపేట క్యాంపు ఆఫీస్లో స్టూడెంట్లకు అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన కొత్తుల రాజమల్లు గతంలో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. కరోనాతో ఉద్యోగం కోల్పోయి ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్నారు. ఆయన కుమార్తెలు కావేరి, శ్రావణి మెరిట్ స్టూడెంట్స్. కావేరి ఇంటర్మీడియట్ 95% మార్కులతో పాసై, నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె నాలుగేండ్ల కోర్సు పూర్తి చేయడానికి రూ.6 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండో కుమార్తె శ్రావణి 97% మార్కులతో ఇంటర్ పాసై, ఏపీలోని తాడేపల్లిగూడెం నిట్లో బీటెక్ (సీఈసీ) చదువుతోంది. శ్రావణి బీటెక్ పూర్తి చేయడానికి రూ.4,17,900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మెడిసిన్, ఇంజనీరింగ్లో సీటు సాధించినా ఫీజులు చెల్లించే స్థోమత లేదనే విషయం కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్.. రాజమల్లు, కావేరి, శ్రావణిని క్యాంప్ ఆఫీసుకు పిలిపించి ట్యూషన్, హాస్టల్ ఫీజులకు సంబంధించిన చెక్కులు అందజేశారు. వారు చదువు పూర్తయ్యే వరకు ఫీజులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. తమకు అండగా నిలిచిన కేటీఆర్కు విద్యార్థులు థ్యాంక్స్ చెప్పారు.