తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వారం రోజుల్లోగా 4 లక్షలకు పైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ(బుధవారం) రెమిడెసివిర్ ఉత్పత్తిదారులతో కేటీఆర్ చర్చలు జరిపారు. సీఎం ఆదేశాల మేరకు ఉత్పత్తిదారులతో చర్చించినట్లు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆస్పత్రుల్లో అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత పెరిగింది. వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్న వారికి డాక్టర్లు ఆక్సిజన్తో పాటు రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ ఎఫెక్ట్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నారు డాక్టర్లు. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యతోపాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం కూడా పెరిగింది. ఉత్పత్తి తగ్గడం.. చాలా ప్రాంతాల్లో ఇంజక్షన్లు లభించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలతో మంత్రి కేటీఆర్ ఇవాళ చర్చలు జరిపారు.