నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు నీటి కొరతలేదు : కేటీఆర్

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు నీటి కొరతలేదు : కేటీఆర్
  •     జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో  బీఆర్​ఎస్​ను గెలిపించాలి
  •     బాన్సువాడలో రేవంత్​రెడ్డి స్పీకర్​ని తిట్టడం నన్ను బాధించింది
  •     మంత్రి కేటీఆర్

కామారెడ్డి, బాన్సువాడ, వెలుగు : బాన్సువాడలో స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు కావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడ లో స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డితో కలిసి రూ.129 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అందులో మున్సిపల్ ఆఫీస్, ఆర్డీవో ఆఫీస్, అంబేద్కర్​భవన్, పార్కులు ఉన్నాయి. అనంతరం  ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ ద్వారా మల్లన్నసాగర్ కు, అక్కడి నుంచి నిజాంసాగర్​కు నీళ్లు వస్తున్నాయన్నారు.

నిజాంసాగర్​కు ఇక సాగు నీళ్లకు కొదవ ఉండదన్నారు. జుక్కల్​లో నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్​ చేపట్టామన్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​లోనూ బీఆర్ఎస్ ​అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించాలన్నారు. బాన్సువాడకు పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి వచ్చి స్పీకర్​ను తిట్టడం తనను బాధించిదని మంత్రి పేర్కొన్నారు. ఆయన హోదా, వయసు, అనుభవానికి విలువ ఇవ్వాలన్నారు. సీఎం, స్పీకర్ పై రేవంత్​రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 11 వేల డబుల్​ బెడ్​రూమ్​ఇండ్లు నిర్మించామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుబంధు, వ్యవసాయానికి 24 కరెంట్​అమలు చేయడం లేదన్నారు. జుక్కల్​ఎమ్మెల్యే హన్మంత్​షిండే, జడ్పీ చైర్​పర్సన్ ​దఫేదర్​ శోభ, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, డీసీసీబీ చైర్మన్ ​పోచారం భాస్కర్​రెడ్డి, మున్సిపల్ ​చైర్మన్ ​గంగాధర్, లీడర్లు  పోచారం సురేందర్​రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడలో మంత్రి కేటీఆర్ ​ప్రోగ్రామ్​ దృష్ట్యా అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.