- రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేమీ లేదు
- అండగా ఉండకుండా వివక్ష చూపుతున్నది: కేటీఆర్
- గిరిజనుల అబివృద్ధి కోసం కొత్త రాష్ట్రపతి కృషి చేయాలి
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: భారత రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపతి ముర్ముకు తెలంగాణ ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లులు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, గిరిజనుల అబివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. బీసీ స్టడీ సర్కిల్లో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ను విజిట్ చేశారు. అభ్యర్థులకు రూ.2 లక్షల విలువైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ శాశ్వత భవనాన్ని ఏడాదిలో నిర్మిస్తామని చెప్పారు. ఏరియా ఆసుపత్రిలోని ప్రత్యేక పిల్లల సంరక్షణ విభాగాన్ని ప్రారంభించారు. తర్వాత కలెక్టరేట్లో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా ఎదిగిందని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. 8 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధుల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ చెల్లించిందని చెప్పారు. కానీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేమీ లేదన్నారు.
ఆర్థిక అభివృద్ధి వల్లే గొప్ప పథకాలు
కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు చాలా తక్కువ అని కేటీఆర్ విమర్శించారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. ఎనిమిదేండ్లలో దేశానికి ట్యాక్సుల రూపంలో రూ.3,65,797 కోట్లు ఇచ్చామని చెప్పారు. దేశం నుంచి రూ.1,68,000 కోట్లు మాత్రమే తిరిగి తెలంగాణకు వచ్చాయన్నారు. తెలంగాణలో గత ఐదేండ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలిచ్చామని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులు సెల్ ఫోన్ పక్కనపెట్టి చదివితే ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. సిరిసిల్లలో మహనీయులు విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. ట్రైనీ ఐఏఎస్లకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్లు పెరిగిన భూగర్భ జలం ఓ పాఠంగా మారిందన్నారు.