- సాగునీటి రంగ ముఖచిత్రాన్ని సీఎం మార్చేశారు: కేటీఆర్
- త్వరలో సమగ్ర భూ సర్వే.. అక్షాంశాలు, రేఖాంశాలతో పాస్ పుస్తకాలిస్తం
- రాష్ట్రం తెచ్చిన ప్రతి చట్టం ప్రజలకు చుట్టం లాంటిది.. ధరణి ఓ సంచలనం
- ఏడేండ్ల పరిపాలన.. సంస్కరణలకు స్వర్ణయుగం
హైదరాబాద్, వెలుగు: ‘కేసీఆర్ అంటే కల్వకుంట చంద్రశేఖర్ రావు కాదు.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని రైతులు అంటున్నారు’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. చిన్న, పెద్ద తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్డ్యామ్లు, ఆనకట్టలు, చిన్నాపెద్ద లిఫ్ట్స్కీమ్లను సీఎం ఒకే గొడుకు కిందకు తెచ్చారని.. ఈ విప్లవాత్మక నిర్ణయాలతో సాగునీటి రంగ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సమగ్ర భూ సర్వే చేపట్టనున్నట్టు వెల్లడించారు. అక్షాంశాలు, రేఖాంశాలతో భూమిని గుర్తించి పాస్ పుస్తకాలు ఇస్తామని, భూ రికార్డుల ట్యాంపరింగ్ లేకుండా చేస్తామని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో పాలన సంస్కరణలు, విద్యుత్, ఐటీ, పారిశ్రామికాభివృద్ధిపై తీర్మానాన్ని కేటీఆర్ప్రతిపాదించారు.
అవినీతి లేకుండా చేస్తున్నం
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రతి చట్టం ప్రజలకు చుట్టం లాంటిదన్నారు. కొత్త సంస్కరణలతో అవినీతి లేకుండా చేస్తున్నామని చెప్పారు. ‘సమగ్ర కుటుంబ సర్వే దేశ చరిత్రలోనే సంచలనం. ఒక్కరోజులోనే రాష్ట్ర ముఖచిత్రం ఆవిష్కరించింది’ అన్నారు. ఈ ఏడేండ్ల పరిపాలన.. సంస్కరణలకు స్వర్ణయుగమని చెప్పారు. సంస్కరణల్లో ధరణి ఓ సంచలనమని, దేశానికే దిక్సూచి అయిందని అన్నారు. నిరుద్యోగ యువత కోసం కొత్త జోనల్ సిస్టం తెచ్చామన్నారు. ‘నాడు కరెంట్ అంటేనే సంక్షోభం. నేడు సంతోషంగా మారింది. వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకు కూడా కరెంట్ అందుతోంది’ అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని.. 348 కిలోమీటర్లు పూర్తయ్యాక కొత్త పెట్టుబడులు, కొత్త పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.
ఐటీకి బ్యాక్బోన్ హైదరాబాద్
ఐటీకి హైదరాబాద్ బ్యాక్బోన్గా మారిందని కేటీఆర్ అన్నారు. ‘గూగుల్కు గుండెకాయ.. అమెజాన్, ఆపిల్కు ఆయువు పట్టు, ఫేస్బుక్కు ఫస్ట్ డెస్టినేషన్ హైదరాబాద్’ అని కామెంట్చేశారు. ఐటీ అంటే ఇన్క్రెడిబుల్ తెలంగాణగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ‘పరిశ్రమలంటే టాటాలు మాత్రమే కాదు. కుల వృత్తులూ కుటీర పరిశ్రమలే. వాటికి కూడా పెద్ద పీట వేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం. పరిశ్రమలు అంటే బిర్లాలు మాత్రమే కాదు. బోర్లా పడిన ఎంఎస్ఎంఈలను కూడా కాపాడాల్సిన బాధ్యత అని నమ్మేది టీఆర్ఎస్ ప్రభుత్వం’ అని చెప్పారు. తెలంగాణ ‘త్రీ ఐ’ని పాటిస్తోందని ప్రధాని మోడీకి చెప్పామని.. త్రీ ఐ అంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అని వివరించారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసి పరిపాలన సౌలభ్యంగా మార్చుకున్నామన్నారు. శాంతి భద్రతలను పటిష్టం చేశామని, భద్రతలో తెలంగాణను నంబర్ వన్గా మార్చామని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు.