అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష విమర్శలు

అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష విమర్శలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లాంఛనంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరోక్షంగా చురకలంటించారు. 74ఏళ్ల క్రితం ఓ కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను భారత యూనియన్ లో విలీనం చేసి సమైక్యతను చాటారన్న కేటీఆర్... ఈ రోజు ఓ కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను విభజించి బెదిరింపులకు పాల్పడేందుకు వచ్చారని ఆరోపించారు. అందుకే దేశానికి కావల్సింది నిర్ణయాత్మక విధానాలేనని, విభజన రాజకీయాలు కావని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై పలు కామెంట్లు చేశారు. 

ఎన్నికల ప్రచారంలో.. ఉద్యమాల్లో హామీ ఇచ్చారని కానీ అమలు చేయలేదని పరోక్షంగా కేసీఆర్ సర్కార్‌ను విమర్నించారు. కర్ణాటక, మహరాష్ట్ర, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించలేదని మండిపడ్డారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే..వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి త్యాగాల వల్ల అధికారంలో ఉన్నారో.. వారికి శ్రద్ధాంజలి వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లు అని..పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు. ఈ  సంవత్సరం హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని పేర్కొన్నారు.