మెట్రో రైలు రెండో దశ శంకుస్థాపనపై మంత్రి కేటీఆర్ సమీక్ష

మెట్రో రైలు రెండో దశ శంకుస్థాపనపై మంత్రి కేటీఆర్ సమీక్ష

డిసెంబర్ 9న జరిగే మెట్రో రైలు విస్తరణ శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన మంత్రి కేటీఆర్...  హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందని చెప్పారు. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైలు విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంతటి కీలకమైన కార్యక్రమం శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 

డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లను ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు రేపు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికల పైన ఇప్పటినుంచే కసరత్తు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కావడం వలన నగర వ్యాప్తంగా ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి లకు మంత్రి కేటీఆర్ సూచించారు.