మంత్రి హరీష్ రావు సాక్షిగా మంత్రి మల్లారెడ్డి- మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ లీడర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇంఛార్జిల పేరుతో పెత్తనం చెలాయిస్తే ఊరుకోబోమని మంత్రి హరీశ్ రావు సమక్షంలో మల్లారెడ్డిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. కొత్త వారికి కాకుండా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే టిక్కెట్లు ఇవ్వాలన్నారు. కడుపు మండితే కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు సుధీర్ రెడ్డి.
టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభ లో హరీష్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిస్తున్న సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన వర్గం నాయకులను దూరం పెడుతూ మంత్రి మల్లారెడ్డి తన ఇష్టానుసారంగా టికెట్ల కేటాయింపు చేసే ప్రయత్నం చేస్తున్నారని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డ కార్యకర్తలను కడుపులో పెట్టుకోవాలని లేనిచో తగిన మూల్యం చెల్లించుకోవాల్సినదేనని ఆయన అన్నారు. ఒకపక్క మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే మాటల దాడి చేసుకోవడంతో పక్కనే ఉన్న వారందరూ అవాక్కయ్యారు.
2014 నుంచి 2018 వరకు మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కీ మేడ్చల్ టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మల్లారెడ్డి కి ఇచ్చింది అప్పటినుండే అసంతృప్తిగా ఉన్న సుధీర్ రెడ్డి శుక్రవారం తన అసహనాన్ని వెళ్లగక్కారు.