కంపెనీ వాళ్లు టూర్కు పోయిన్రు: మల్లారెడ్డి సమాధానం

కంపెనీ వాళ్లు టూర్కు పోయిన్రు: మల్లారెడ్డి సమాధానం
  • కంపెనీ వాళ్లు టూర్​కు పోయిన్రు !
  • పనులపై ప్రశ్నించిన జనాలకు మంత్రి మల్లారెడ్డి సమాధానం
  • వృద్ధులను బస్సుల్లో హెల్త్ క్యాంపు కు తరలించిన మినిస్టర్​
  • కవరేజీకి వెళ్లిన మీడియాను అడ్డుకున్న టీఆర్ఎస్​ కార్యకర్తలు

యాదాద్రి​, వెలుగు: ‘సార్​ కంపెనీతో మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తనన్నరు కదా? ఏమైంది? అని ప్రశ్నించిన జనాలకు మంత్రి మల్లారెడ్డి షాకింగ్ సమాధానం ఇచ్చారు. ‘వాళ్లంతా టూర్​లో ఉన్నరు. వచ్చిన తర్వాత చేయిస్తలే’ అని చెప్పడంతో బిత్తరపోయారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్​మండలం ఆరెగూడెం ఇన్​చార్జిగా మంత్రి మల్లారెడ్డి కొనసాగుతున్నారు. కొద్దిరోజులుగా ఆయన ఇక్కడ ప్రచారం చేస్తూ స్థానికులకు హామీలిస్తున్నారు. మూడు రోజుల కింద దివీస్ ​కంపెనీ మేనేజ్​మెంట్​ తో మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బుధవారం పనుల కోసం యాజమాన్యాన్ని పిలిపించాలని కోరగా, వాళ్లు టూర్​కు వెళ్లారని, వచ్చిన తర్వాత మాట్లాడుతానని మినిస్టర్ ​రిప్లై ఇచ్చారు.  

హాస్పిటల్ కు తరలింపు

తాను ఇన్​చార్జిగా ఉన్న గ్రామాలకు చెందిన పలువురిని మంత్రి.. హైదరాబాద్ లోని తన హాస్పిటల్​లో హెల్త్​ చెకప్​కు పంపించారు. ప్రచారంలో భాగంగా తనను కలిసిన వృద్ధులకు ఫ్రీగా హెల్త్​చెకప్​ చేయిస్తానని చెబుతూ వస్తున్నారు. బుధవారం అందరినీ బస్సుల్లో హైదరాబాద్ ​పంపించారు.  

మిగిలిన మొత్తం ఎన్నికల తర్వాతే?

కమ్యూనిటీ బిల్డింగ్స్ ​కోసం తాను ఇస్తానన్న డబ్బులను ఎన్నికల తర్వాతే ఇస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఆరెగూడెంలో గౌడ కులస్తులతో మీటింగ్​నిర్వహించారు. రెండ్రోజుల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం గౌడ కమ్యూనిటీ బిల్డింగ్​కు ఇస్తానన్న రూ. 12 లక్షల్లో బుధవారం కొంత మొత్తం ఇచ్చారని, మిగిలినవి ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. వడ్డెర కులానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. 

మీ కవరేజీ అవసరం లేదు

గౌడ కులస్తులతో మంత్రి మీటింగ్​ సందర్భంగా కవరేజీకి వెళ్లిన 'వీ 6, వెలుగు' రిపోర్టర్లకు వ్యతిరేకంగా 'గో బ్యాక్​' అంటూ టీఆర్​ఎస్​ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి ఫండ్స్​ఇవ్వడానికి వస్తుంటే వీ6, వెలుగు ఆయనను బద్నాం చేస్తున్నాయని, మీ కవరేజీ మాకు అవసరం లేదంటూ కామెంట్​ చేశారు. 

మంత్రి కారు తనిఖీ

మంత్రి మల్లారెడ్డి కారును కేంద్ర పోలీసు బలగాలు తనిఖీ చేశాయి. చౌటుప్పల్ మండలం గుండ్లబావిలో ప్రచారం నిర్వహించి ఆరెగూడెం వెళ్తుండగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీ చేశారు.