
ఖమ్మం రూరల్, వెలుగు: ‘కేటీఆర్.. నీకు దమ్ముంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి చూపించు. మూడున్నరేండ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా ఎందుకు? అప్పటికి నువ్వు ఇండియాలో ఉంటవో, విదేశాలకు చెక్కేస్తవో..’ అని కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
గురువారం (సెప్టెంబర్ 18) ఖమ్మం జిల్లా ఏదులాపురంలో వివిధ పార్టీలకు చెందిన 80 కుటుంబాలు కాంగ్రెస్లో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముందు తన ఇంటిని, పార్టీని కేటీఆర్ చక్కబెట్టుకోవాలన్నారు. ‘మీ నాయనే పాలేరులో మూడు సార్లు ముక్కు నేలకురాసినా ఏమీ సాధించలేకపోయాడు.. నువ్వెంత, బచ్చాగాడిని’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ అహంకారానికి ఇప్పటికే ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పారని, మూడో సారీ సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ భంగపాటు తప్పదన్నారు. ‘పాలేరులో నువ్వు నిలబడు.. నీపై ఓ కార్యకర్తను పెట్టి కాంగ్రెస్ను గెలిపిస్తా.. కాచుకో’ అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి లక్ష ఇండ్లు కట్టిఉంటే.. పదేండ్లలో పది లక్షల పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరేదన్నారు. కానీ అలా చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టిందని, అది కొట్టుకుపోయిందని విమర్శించారు. పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటుందని, కేసీఆర్ ఫ్యామిలీ ఒళ్లంతా విషం నింపుకొని ఉందని ఫైర్ అయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, కాంగ్రెస్ లీడర్లు ధరావత్ రామ్మూర్తి నాయక్, బొర్రా రాజశేఖర్, హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.