
- ఖమ్మం జిల్లాలో స్టూడెంట్లకు సైకిళ్లు పంపిణీ
కూసుమంచి, వెలుగు : ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా స్టూడెంట్లను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం కూసుమంచిలో జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు కూసుమంచి కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా, డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు.
ప్రతి సంవత్సరం స్టూడెంట్లకు సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం 20 నెలల్లో రూ. 470 కోట్లు మంజూరు చేశామన్నారు. గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, కూసుమంచి తహసీల్దార్ రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.