హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్గా తీర్చిదిద్దుతా : మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్గా తీర్చిదిద్దుతా : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ, వెలుగు: హుస్నాబాద్​ను ప్లాస్టిక్​ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. శుక్రవారం పట్టణంలో మార్నింగ్​ వాక్​ చేస్తూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ప్లాస్టిక్​ వాడకం వల్ల వచ్చే ఇబ్బందులపై మున్సిపల్​ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్​ లో హుస్నాబాద్​మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 139, రాష్ట్ర స్థాయిలో 9, జిల్లా స్థాయిలో ఒకటో ర్యాంక్​ సాధించడం పట్ల అధికారులను, సిబ్బందిని అభినందించారు. ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించాలని ఇప్పటికే గ్రామ గ్రామాన స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.పెళ్లిళ్లు, శుభ కార్యాలకు సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వాడొద్దని స్టీల్​ సామగ్రినే వాడాలని సూచించారు. 

340 హోటళ్లలో 34 వేల స్టీల్ గ్లాసులు ఇచ్చామన్నారు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్​ను సందర్శించి రోగులను పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్​లో వాటర్​ ప్లాంట్​ను కావాలని రోగులు కోరగా 48గంటల్లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హుస్నాబాద్​ బస్టాండ్​ ఆవరణలో మొక్కలు నాటారు.  కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్​శివ్వయ్య, మున్సిపల్​కమిషనర్​మల్లికార్జున్, ఆర్టీసీ డీఎం వెంకన్న​పాల్గొన్నారు.