
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం (జూన్ 4) గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందని.. అందుకే ఆమె తన తండ్రి కేసీఆర్కు లేఖ రాసిందన్నారు. కవిత, బీఆర్ఎస్ పంచాయితీ టీకప్పులో తుపాన్ లాంటిదని ఎద్దేవా చేశారు. వాళ్ళ ఉనికి కోసం రాజకీయంగా దృష్టి మరల్చడానికి మాత్రమే కవిత లెటర్ రాసిందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్ విచారిస్తున్నదని.. కమిషన్ పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పేరుతో నీళ్లు ఇస్తే పర్వాలేదు కానీ.. నీళ్ల పేరుతో బీఆర్ఎస్ నేతలు కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తరుపున ప్రజల సమస్యలు విని పరిష్కారించేందుకు గతంలో గాంధీ భవన్లో ముఖాముఖి జరిగిందని.. ఈ కార్యక్రమాన్ని బుధవారం (జూన్ 4) నుంచి పునః ప్రారంభిస్తున్నామని తెలిపారు.
Also Read : కాళేశ్వరం ప్రాజెక్టుకు వాడిన స్టీల్, సిమెంట్తో ఇన్ని కట్టొచ్చు
ప్రజాపాలన కావాలని కోరుకున్న ప్రతి కామన్ మెన్కు గాంధీ భవన్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇక్కడ వచ్చిన అప్లికేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పరిష్కారిస్తామన్నారు. మంత్రులను కల్వడానికి ఇబ్బంది కలగొచ్చు కానీ తల్లి లాంటి గాంధీ భవన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని అన్నారు. గ్రీన్ చానల్ ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులేని ఊరు, హనుమంతుని గుడి లేని గ్రామం లేదన్నారు. హైదరాబాద్లో లక్ష రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యల్లోకి నెట్టిన వారు ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నారని బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు.