ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు : ఆడబిడ్డల ఆశీర్వాదమే కాంగ్రెస్కు శ్రీరామ రక్ష అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆడబిడ్డలకు సారె అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో మెడికల్ క్యాంప్ సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. త్వరలోనే మరో సారి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ సైతం నిర్వహిస్తామని తెలిపారు. లయన్స్ క్లబ్ తరఫున కంటి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్తో క్యాన్సర్ ముప్పు ఉన్నందున, హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చడానికి ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి మహిళ ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. మహిళా సంఘాలు ఐక్యంగా ఉంటూ ఆర్థికవృద్ధి సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సుకినె సంతాజీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, నాయకులు గొడిశాల యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.
