కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి

కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ నిర్మాణంలో ఉన్న ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించారు. దూల్పూర్ రెడ్ స్టోన్ రాతి కట్టడం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని.. దానికి తగ్గట్టు వర్క్ ఫోర్స్ డబుల్ చేయాలని వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. దూల్పూర్ రెడ్ సాండ్ స్టోన్ రాతి కట్టడం నిర్మాణ పనుల కోసం రాజస్థాన్ నుంచి 50 మంది మేస్త్రీలను ప్రత్యేకంగా తెప్పించాలని వర్క్ ఏజెన్సీకి సూచించారు. ఎలివేషన్ వచ్చే జీఆర్సీ క్లాడింగ్ పనుల నిపుణులను వెంటనే తెప్పించి రౌండ్ పిల్లర్ల నగిషీల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రానైట్, ఫ్లోరింగ్ పనుల్లో ఇంకా వేగం పెంచాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్దేశించారు. యూపీవీసీ విండో పనులు, ఫాల్ సీలింగ్ పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వాటితో పాటు మిగిలి ఉన్న సివిల్ పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు. ఈ పనులన్నీ సమాంతరంగా జరిగేలా ఆర్ అండ్ బీ ఇంజనీర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

కాంపౌండ్ వాల్ కి వచ్చే రెయిలింగ్ పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. 32 డోమ్ నిర్మాణాలకుగానూ 16 డోమ్ ల నిర్మాణం పూర్తయిందన్నారు. మరో 8 డోమ్ ల స్ట్రక్చరల్ పనులు పూర్తి కాగా మిగతా డోమ్ ల నిర్మాణాలు కూడా తొందరగా చేపట్టాలన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ నిర్మాణం కోసం 1450 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇంకో 1000 మంది స్కిల్ లేబర్ లను వెంటనే సమకూర్చుకోవాలని ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణంలోని ప్రార్ధనా మందిరాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. గుడి, మసీదు, చర్చ్, సెక్యూరిటీ బ్లాక్, ఆన్సలిరీ బిల్డింగ్ ల పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.