ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వెలుగు నెట్ వర్క్: కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చే ప్రజలకు సౌలతులు కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మంగళవారం మానుకోటలో ఈ ప్రోగ్రాంపై రివ్యూ చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మల్టీపర్పస్​ సూపర్ వైజర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.‘కంటి వెలుగు’ స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పుష్ప మంగళవారం హనుమకొండలో పర్యటించారు. జిల్లా వైద్యాధికారులతో రివ్యూ నిర్వహించారు.  ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సిటీలో స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

జనగామలో కలెక్టర్ శివలింగయ్య  కంటి వెలుగు పై మండల ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభయ్యే ప్రోగ్రాంకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. క్యాంపులు నిర్వహించే చోట్ల కుర్చీలు, టెంట్లు, టాయిలెట్లు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలకేంద్రంలోనూ ఎమ్మెల్యే రాజయ్య కంటి వెలుగుపై రివ్యూ చేశారు. 100 రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలనే లక్ష్యంతో రెండో విడత ప్రారంభించామని చెప్పారు. దీనిపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనంతరం మండలంలోని 34మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. నర్సంపేటలోనూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ప్రోగ్రాంపై రివ్యూ చేశారు. కంటి వెలుగు ప్రోగ్రాంను స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు సక్సెస్ చేయాలని జడ్పీటీసీ సింగులాల్ అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా పర్వతగిరి పీహెచ్ సీలో జరిగిన ‘కంటి వెలుగు’ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18న మొదలై వంద రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షతన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, ఈ ప్రోగ్రాంను కొనసాగించాలన్నారు.

అభివృద్ధిని చూసి విమర్శించండి: ఎమ్మెల్యే రెడ్యా నాయక్

నర్సింహులపేట, వెలుగు: తనను విమర్శించే వాళ్లు.. అభివృద్ధిని చూసి విమర్శించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ హితవు పలికారు. గతంలో గెలిచిన నాయకులు ఒక్క మంచి పని చేయలేదన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణస్వీకారం జరగగా.. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కేంద్రం మోటార్లకు మీటర్లు పెడతామంటే... సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలకు పార్టీ లీడర్లు దీటుగా జవాబు చెప్పాలన్నారు. ఎంపీపీ టేకుల సుశీల, వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు మైదం దేవేందర్, సర్పంచులు ఫోరం మండలాధ్యక్షులు మెరుగు శంకర్, ఆలయ చైర్మన్ బొల్లం రమేశ్, రైతు బంధు మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి తదితరులున్నారు.

ఒలంపియాడ్ టెస్టులో స్టేట్ అవార్డ్

హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా గోపాలపురంలోని విద్యాధరి హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న పులికంటి ఆశ్రిక.. స్టేట్ లెవల్ ఒలంపియాడ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ లో సత్తా చాటింది. గత నెల నిర్వహించిన టెస్టులో రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ప్రిన్సిపల్ వైవీ రావు, టీచర్లు ఆశ్రికను అభినందించారు.


కాలనీల్లో మంచి నీళ్లు కరువు

కాజీపేట, వెలుగు: ‘ఇంటింటికీ బీజేపీ’లో భాగంగా బీజీపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మంగళవారం కాజీపేట పరిధిలోని 47వ డివిజన్ లో పర్యటించారు. డిజిల్ కాలనీ, బాపూజీ నగర్, బూడిదగడ్డ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల్లో మంచి నీళ్లు కూడా రావడం లేదని స్థానికులు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పేరు చెప్పి జనాన్ని మోసం చేశారన్నారు. కేవలం కేసీఆర్ కమీషన్లకే ఆ ప్రాజెక్టు పనికొచ్చిందన్నారు.

కేసీఆర్ పూటకో మాట

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: సీఎం కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. నిరుద్యోగ భృతి, పోడు పట్టాలు, రుణమాఫీ చేస్తానని మోసం చేశాడన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపూర్ లో పార్టీ శ్రేణులతో మీటింగ్ నిర్వహించారు. జోడో యాత్రను చూసి మోడీకి కండ్లు మండుతున్నాయని, రాహుల్ గాంధీ అపూర్వ స్పందన వస్తుందన్నారు. పార్టీ శ్రేణులు కలిసిగట్టుగా పనిచేసి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలన్నారు.

కాన్వాయ్ ఆపి.. నాటు వేసి..

రేగొండ, వెలుగు: వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి కూలీలతో కలిసి నాటు వేశారు. మంగళవారం 
భూపాలపల్లి పట్టణాకి వెళ్తున్న క్రమంలో రేగొండ మంలం రూపిరెడ్డిపల్లి శివారులో కాన్వాయ్ ఆపి, కూలీలతో మాట్లాడారు. వారితో కలిసి నాటు వేశారు.

మహిళల సంక్షేమానికి కృషి

తొర్రూరు, వెలుగు: మహిళ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం శ్రీవాణి ఎడ్యుకేషన్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా మంత్రి హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్యలక్ష్మి, భరోసా సెంటర్లు, సఖి సెంటర్లు, షీ టీమ్స్, అమ్మఒడి లాంటి ఎన్నో పథకాలను కేసీఆర్ నడిపిస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ పథకాలు మహిళల జీవితాల్లో వెలుగును నింపుతున్నాయన్నారు. సొసైటీ ఫౌండర్​డాక్టర్ ఎస్. నాగవాణి, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి ఉన్నారు.

10 అంతస్తులు..32 ప్లాట్ ఫాంలు

  • త్వరలో వరంగల్ బస్టాండ్ నిర్మాణం

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ బస్ టర్మినల్ ఏర్పాటుకు రూ.75కోట్లు కేటాయించామని, 10 అంతస్తులు, 32 ప్లాట్ ఫాంలతో దీనిని నిర్మిస్తామని కలెక్టర్ గోపి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే నరేందర్, కుడా చైర్మన్ సుందర రాజ్, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. ఇక్కడి పాత బస్టాండ్ ను తాత్కాలికంగా చేరే చోటుకు తరలిస్తామన్నారు. నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ పూర్తి అయిందని..త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. పై అంతస్తుల్లో షాపింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో నిర్మించే నియో మెట్రో రైలుకు దీనిని అనుసంధానం చేస్తామన్నారు.

కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

సీఎం కేసీఆర్ మహబూబాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంగళవారం తాళ్లపూసపల్లి, సాలార్ తండా సమీపంలో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ లను పరిశీలించారు. సీఎం టూర్​లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్​ రావు, జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు ఉన్నారు.    
– మహబూబాబాద్, వెలుగు

గ్రామాభివృద్ధికి రూ.కోటి మంజూరు

మొగుళ్ళపల్లి,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామ అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూ.కోటి నిధులు మంజూరు చేశారని సర్పంచ్ బెల్లంకొండ మాధవి శ్యాంసుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం వారు మీడియాతూ.. గతేడాది పల్లెప్రగతిలో భాగంగా మంత్రి తమ గ్రామంలో పర్యటించారన్నారు. వివిధ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. రూ.కోటి మంజూరు చేశారన్నారు. వీటితో గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు వంటి పనులు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పెట్రోల్ అయిపోతుందని ఓవర్ స్పీడ్

  • బైక్ మీది నుంచి కిందపడి మైనర్ మృతి

నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: బండిలో పెట్రోల్ అయిపోతుందని, త్వరగా పెట్రోల్ బంక్ వెళ్లాలనే ఆత్రుతతో ఓ మైనర్ బాలుడు బైక్ మీది నుంచి కిందపడి చనిపోయాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో జరిగింది. ఎస్సై జగదీశ్​ వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలకేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలుడు.. సోమవారం రాత్రి కుమ్మరికుంట్లకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గున్నేపల్లి స్టేజీ వద్దకు రాగానే పెట్రోల్ అయిపోయింది. బైక్ లో ఉండే కొద్దిపాటి పెట్రోల్ తో కుమ్మరికుంట్లలోని బంక్ వద్దకు ఓవర్ స్పీడ్ గా వెళ్లాడు. మధ్యలో అదుపుతప్పి కిందపడి తలకు తీవ్ర గాయాలై చనిపోయాడు. మరోవైపు మైనర్లు బైక్ నడపవద్దని పోలీసులు సూచిస్తున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు.

యువత చూపు బీజేపీవైపు

నర్సంపేట, వెలుగు: రాబోయే ఎన్నికల్లో నర్సంపేటలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జిల్లా నాయకుడు డాక్టర్​ గోగుల రాణాప్రతాప్​రెడ్డి అన్నారు. నర్సంపేట టౌన్​, గురిజాల, చిన్న గురిజాల విలేజ్​లకు చెందిన రెండు వందల మంది యువకులు రాణాప్రతాప్​రెడ్డి సమక్షంలో మంగళవారం బీజేపీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఫైర్​ అయ్యారు. బీజేపీలోనే యువతకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. యువతతోనే మార్పు సాధ్యమని అన్నారు.