చట్టసభల్లో ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం దురదృష్టకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ నెల 8వ తేదీన హనుమకొండలోని కేయూ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు అధికారికంగా జరుపనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడిమాతో మాట్లాడిన ఆమె.. మహిళా దినోత్సవ వేడుకలకు మంత్రులు కేటీఆర్, సబితారెడీ హాజరవుతారని ప్రకటించారు.
గవర్నర్ వ్యవస్థను మేము గౌరవిస్తామని చెప్పిన సత్యవతి రాథోడ్..చట్టసభల్లో జరిగిన తీర్మానాలనే గౌరవించడం లేదంటే గవర్నర్ వ్యవస్థపై నమ్మకం పోతుందని తెలిపారు. ఇలాంటి క్రమంలో గవర్నర్ ను ఎందుకు గౌరవించాలి.. ఆమె దగ్గరకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. కాగా, ఇటీవల జరిగిన మెడికో విద్యార్థిని ప్రీతి సంఘటన బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందన్నారు. డా. ప్రీతి కుటుంబానికి ఇంకా ఎలాంటి న్యాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కుటుంబ సభ్యులు ఎవరి ప్రలోభాలలో పడవద్దని సూచించారు. విచారణపై మీకు నమ్మకం లేకపోతే మీరు కోరుకున్న వారితో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.