పోడు భూముల జోలికి పోవద్దు .. ఫారెస్టు ఆఫీసర్లకు మంత్రి సీతక్క ఆదేశం

పోడు భూముల జోలికి పోవద్దు .. ఫారెస్టు ఆఫీసర్లకు మంత్రి సీతక్క ఆదేశం
  • ఇందిరమ్మ ఇండ్లను స్పీడప్​ చేయాలి  
  • నకిలీ సీడ్స్ అమ్మేవారిపై పీడీ యాక్ట్ పెట్టాలి  
  • గ్రామాల్లో ఫ్లడ్ ​మేనేజ్​మెంట్ ​కమిటీలు వేయాలి
  • మంచిర్యాలలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా రివ్యూ మీటింగ్

మంచిర్యాల, వెలుగు: పది, ఇరవై ఏండ్లుగా సాగులో ఉన్న పోడు భూముల జోలికి పోవద్దని, ఆదివాసీ గిరిజన రైతులను ఫారెస్టు ఆఫీసర్లు ఇబ్బంది పెట్టొద్దని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశించారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్​లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్​లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం సీజన్​కు సన్నద్ధతతో పాటు ఇతర స్కీమ్ లపై మంత్రి సమీక్షించారు. 

ఫారెస్టు భూముల పేరిట ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందిస్తూ దశాబ్దాలుగా రైతులు దున్నుకుంటున్న భూముల జోలికి వెళ్లొద్దని, ఈ పంట సీజన్​ పూర్తయిన తర్వాత ఫారెస్టు, రెవెన్యూ జాయింట్​సర్వే చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ ఇండ్లు వచ్చాయని, ట్రైబల్ ​ఏరియాకు 12 వేలు అదనంగా ఇచ్చామన్నారు. వెంటనే  ఇండ్ల నిర్మాణాలను స్పీడప్​ చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈసారి ముందస్తు వానలతో ఖరీఫ్​ సీజన్​ మొదలైందని యాక్షన్​ప్లాన్ రెడీ చేసుకొని విత్తనాలు, ఎరువులతో సిద్ధంగా ఉండాలన్నారు. 

ఫర్టిలైజర్స్​డీలర్లతో జిల్లాల వారీగా మీటింగ్ లు  ఏర్పాటుచేసి నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్​ నమోదు చేస్తామని వార్నింగ్​ ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో ఫ్లడ్ మేనేజ్​మెంట్​కమిటీలు ఏర్పాటు చేసుకోని ముంపు నివారణ చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. రివ్యూ మీటింగ్ కలెక్టర్ కుమార్ దీపక్​అధ్యక్షతన నిర్వహించగా..  ఉమ్మడి ఎమ్మెల్సీలు దండె విఠల్, మల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, బి.రామారావు పటేల్, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతితో పాటు అధికారులు పాల్గొన్నారు.