అందరికీ అందుబాటులో ఉంటాం : మంత్రి సీతక్క

అందరికీ అందుబాటులో ఉంటాం : మంత్రి సీతక్క

మంత్రి సీతక్క

భద్రాచలం, వెలుగు :  ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటామని పంచాయతీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. చర్ల మండలంలో శుక్రవారం  ఆమె పర్యటించారు. లక్ష్మీకాలనీలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో 110 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని అమలు చేసి తీరుతుందన్నారు. ఐటీడీఏల పరిధిలో అదనంగా గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు. 

అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆర్థికపరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నా సంక్షేమ పథకాలను మాత్రం ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సంఘాల్లో 60 ఏండ్లు నిండిన మహిళలు సైతం చేరి ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు సర్కారు అవకాశం కల్పిస్తోందన్నారు. మంత్రి వెంట ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆర్డీవో దామోదర్​రావు ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సీఐ రాజువర్మ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత కల్పించారు. రాత్రి కావడంతో వెంకటాపురం, వాజేడు మీదుగా ములుగు వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో తిరిగి భద్రాచలం మీదుగా వెళ్లారు.