
- ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా శక్తి సాధ్యమవుతుంది
- మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
పెద్దపల్లి, వెలుగు: ఇందిరమ్మలాగా ప్రతీ మహిళ శక్తిమంతురాలు కావాలని, అందుకోసం ఆర్థికంగా ఎదగాలని మహిళ, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు 9 ఆర్టీసీ అద్దె బస్సులు, వడ్డీ లేని రుణాల చెక్కులను సమాఖ్య గ్రూపులకు గ్రూపుకు అందజేశారు.
ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి సంకల్పించారన్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన లోన్లు 99 శాతం తిరిగి చెల్లిస్తుండడంతో బ్యాంకులే వారికి రుణాలు ఇచ్చేందుకు క్యూ కడుతున్నాయన్నారు. గతేడాది కన్నా 2024-–25లో రూ. 6 వేల కోట్ల అధికంగా రుణాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ వంటి వ్యాపారాలతో మహిళలకు అదనపు ఆదాయం లభిస్తుందని అన్నారు. ఆర్టీసీలో పెట్టిన అద్దె బస్సుల ద్వారా నెలకు రూ.75 వేలు వస్తున్నాయన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా కమీషన్రూపంలో మహిళా సంఘాలకు రూ. కోటి వరకు వస్తోందన్నారు.
మహిళా సంఘాల సభ్యులు ఎవరైనా చనిపోతే రూ.10 లక్షల బీమా వస్తుందన్నారు. 15 ఏండ్ల నుంచి 60 ఏండ్లు పైబడిన వారిని కూడా సంఘాల్లో చేర్చాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు డ్రోన్ వ్యాపారం కూడా చేస్తున్నారని, మహిళలు వివిధ రకాలైన వ్యాపారాలు చేసేందుకు ముందుకు రావాలని ధైర్యంగా ఉండాలని అన్నారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మంథని, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో మహిళా సంఘాల ద్వారా ఒక మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు పెద్దపల్లి పట్టణంలో వీ హబ్ మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సహించాలి
ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం కొత్తగా అందించే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తున్నామన్నారు. కోటీ మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో ఏటా రూ. 20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులను ఆయిల్పామ్ పంట సాగుకు ప్రోత్సహించాలన్నారు. ఎకరం ఆయిల్పామ్ తోటకు ప్రభుత్వం రూ. 51 వేలు సబ్సిడీ ఇస్తోందన్నారు. ఇప్పటికే పెద్దపల్లిలో తిరుమాలయ కంపెనీ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తోందన్నారు.