
- చర్యలు తీసుకున్న సంగతి కూడా తెలుసుకోకుండా విమర్శలా: సీతక్క
- అంగన్వాడీలో కుళ్లిన గుడ్లంటూ ‘ఎక్స్’లో కేటీఆర్ చేసిన పోస్ట్పై ఫైర్
హైదరాబాద్, వెలుగు : సోషల్మీడియా ‘ఎక్స్’ లో కేటీఆర్ చేసిన పోస్ట్ బాధ్యతా రహితమని మంత్రి సీతక్క మండిపడ్డారు. పిల్లలకు కుళ్లిన కోడిగుడ్లు ఇచ్చిన అంగన్వాడీ సిబ్బంది, వాటిని సప్లై చేసిన కాంట్రాక్టర్కు మెమో ఇచ్చి వివరణ కోరామన్నారు. అలాగే వారిని సస్పెండ్ చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇవేవి తెలుసుకోకుండా కేటీఆర్సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సోమవారం విమర్శించారు. ‘భువనగిరి జిల్లా ముదిరాజ్వాడ అంగన్వాడీ కేంద్రంలో ఈ నెల 22న కుళ్లిపోయిన గుడ్లను పెట్టారన్న విషయం మా దృష్టికి వచ్చింది.
అదే రోజు ఎంక్వైరీ చేయించి, కోడిగుడ్ల కాంట్రాక్టర్కు మెమో జారీ చేశాం. అంగన్వాడీ సూపర్వైజర్, టీచర్, హెల్పర్కు మెమోలు ఇచ్చి, వివరణ కోరాం. వారు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో, వారిని సస్పెండ్ చేసేందుకు చర్యలు చేపట్టాం. అయితే ఇవేవీ తెలుసుకోకుండా కేటీఆర్ పోస్టు చేస్తున్నరు’ అని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా, అప్పుడు అధికారంలో ఉండి ఎలాంటి చర్యలు తీసుకోని కేటీఆర్, ఇప్పుడు తాము చర్యలు తీసుకుంటుంటే కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
అంగన్వాడీలకు రోజూ 18 లక్షలకుపైగా గుడ్లు సరఫరా అవుతున్నాయని, ఎక్కడ పొరపాటు జరిగినా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ‘‘అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కుళ్లిన గుడ్లను అందించడం దుర్మార్గం’’ సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పసిపిల్లల ప్రాణాలతోచెలగాటమాడుతున్నదని విమర్శించారు. వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.