ఇటీవల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోడీ క్లాస్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మోదీ సమావేశ లీకులపై ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ లో జరిగిన విషయాలు బయట చెప్పొద్దని ప్రధానమంత్రి చెప్పినా కూడా బయటకి చెప్పారని మండిపడ్డారు. లీకులు చేసిన వ్యక్తులు మెంటలోళ్లు.. వారెవరో చెప్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానమంత్రి మీటింగ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారని చెప్పారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయమని కోరినట్టు తెలిపారు. దక్షిణ భారతదేశ నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారని..బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు కిషన్ రెడ్డి.
ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ అనైతికంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏ విషయాలు మాట్లాడాలో అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండటం దురదృష్టకరమన్నారు కిషన్ రెడ్డి.
అశ్విని వైష్ణవ్ తో భేటీ
మరో వైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన కిషన్ రెడ్డి... తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ చేసినట్టు తెలిపారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణం వేగవంతం చేయడంపై చర్చించామన్నారు. రూ. 400 కోట్లతో హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు పొడిగించాల్సి ఉన్న MMTS సెకండ్ ఫేస్ గురించి చర్చించినట్టు చెప్పారు. కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కేంద్రమంత్రిని కోరానన్నారు కిషన్ రెడ్డి.
