సమస్య ఉన్నట్లే.. పరిష్కారం ఉంటుంది .. జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్

సమస్య ఉన్నట్లే.. పరిష్కారం ఉంటుంది .. జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్
  • అధికారులు మనస్సు పెట్టి పని చేయాలి
  • శానిటేషన్, నీరు కలుషితం కాకుండా స్పెషల్ ఫోకస్ చేయాలి
  • ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు కట్టడం లేదో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి
  • కామారెడ్డిలో రాష్ట్ర మంత్రి సీతక్క

కామారెడ్డి, వెలుగు : సమస్య ఉన్నట్లుగానే పరిష్కారం కూడా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్​మెంట్,  స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో  వివిధ అంశాలపై మంత్రి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. పంచాయతీరాజ్, ఇందిరమ్మ ఇండ్లు, హెల్త్, వాటర్ సప్లయ్, అగ్రికల్చర్ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  అధికారులు మనస్సు పెట్టి పని చేయాలని,  గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. 

ఫండ్స్​ అవసరం లేకుండానే కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చన్నారు.  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్​పై స్పెషల్​ ఫోకస్ చేయాలన్నారు.   నీరు కలుషితం కాకుండా చూసే బాధ్యత సెక్రటరీలపై ఉందన్నారు.  డాక్టర్లు, హెల్త్ స్టాఫ్​పొద్దునే గ్రామాలకు వెళ్లాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణ పనులు స్పీడప్ చేయాలన్నారు. త్వరగా వీటి పనులు కంప్లీట్​ అయితే కొత్తగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టని వారు ఎందుకు కట్టడం లేదో ఐదు రోజుల్లో స్పెషల్ డ్రైవ్​ చేపట్టాలన్నారు. అంగన్​వాడీ బిల్డింగ్​ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు.  రోడ్ల నిర్మాణ పనులు, టెండర్ల పక్రియ త్వరగా చేయాలన్నారు.  ఖాళీగా ఉన్న అంగన్​వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. 

రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఎరువుల కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ రివ్యూలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ,  ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్​రెడ్డి, కె.మదన్ మోహన్​రావు, తోట లక్ష్మీకాంతారావు, ఎంపీ సురేష్ షెట్కార్,  స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితారామచంద్రన్,  కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్,  ఎస్పీ రాజేశ్​చంద్ర, డీఎఫ్​వో నిఖిత,   అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్, సబ్​ కలెక్టర్​ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, లైబ్రరీ జిల్లా చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆయా శాఖల పనితీరుపై  ఎమ్మెల్యేల అసంతృప్తి..

గ్రామాల్లో శానిటేషన్​,  నీటి సప్లయ్,  రోడ్ల నిర్మాణ పనులు,  పీహెచ్​సీలు, సీహెచ్​సీల్లో డాక్టర్ల విధులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్, బిల్లుల చెల్లింపు, ఫారెస్ట్​ ఏరియాల్లోని తండాల్లో ఇండ్ల నిర్మాణం తదితర అంశాలపై ఎమ్మెల్యేలు కె.మదన్​మోహన్​రావు, పోచారం శ్రీనివాస్​రెడ్డి,  తోట లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ  అసంతృప్తి వ్యక్తం చేశారు.  పంచాయతీ సెక్రటరీలు స్థానికంగా ఉండేలా చూడాలన్నారు. డ్రైనేజీల క్లీనింగ్​పై  గ్రామాల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పేర్కొన్నారు. జుక్కల్​ నియోజకవర్గంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది  స్థానికంగా ఉండడం లేదన్నారు. మంత్రి మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలను జిల్లా పరిధిలోనే బదిలీ చేసుకోవచ్చన్నారు.  సెక్రటరీలు హెడ్​ క్వార్టర్​లోనే ఉండాలనే దానిపై రాష్ర్ట స్థాయిలో నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇస్తామన్నారు.  ఎల్లారెడ్డి హాస్పిటల్​లో గైనిక్​ డాక్టర్​ లేక ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణ సమస్యలపై రాష్ర్ట స్థాయిలో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 

ఆడ బిడ్డల ఆనందమే తెలంగాణ సౌభాగ్యం
మహిళా శక్తి సంబురాల్లో మంత్రి సీతక్క 

ఆడబిడ్డల ఆనందమే తెలంగాణ సౌభాగ్యమని రాష్ర్ట మంత్రి సీతక్క పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫంక్షన్​ హాల్​లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. బ్యాంక్​ లింకేజీకి సంబంధించి రూ. 20. 56 కోట్ల చెక్​లను మంత్రి అందించారు. కామారెడ్డి నియోజకవర్గానికి వడ్డీ రుణం రాయితీ సొమ్ము రూ. 5.28 కోట్ల చెక్ అందించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తి చాలా గొప్పదని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే సీఎం లక్ష్యమన్నారు.  

మహిళలను అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నామన్నారు.  మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సోలార్ విద్యుత్, పెట్రోల్ పంపుల వంటి వ్యాపారాలు సంఘాల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ మాట్లాడుతూ అర్హులైన  అందరికీ రేషన్​ కార్డులు ఇస్తున్నామన్నారు. ఎంపీ సురేశ్​​ షెట్కార్​, కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, జిల్లా లైబ్రరీ ఛైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి, సెర్ఫ్​ సీఈవో నగేస్​, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.  వనమహోత్సవంలో భాగంగా  మైనార్టీ రెసిడెన్షియల్​ స్కూల్​లో మంత్రి,  తదితరులు మొక్కలు నాటారు.