ములుగు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను : మంత్రి సీతక్క

ములుగు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను : మంత్రి సీతక్క

ములుగు/వెంకటాపూర్, వెలుగు : ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ములుగు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సీతక్క చెప్పారు. మంత్రి అయిన తర్వాత తొలిసారిగా శుక్రవారం తాను పుట్టిన ఊరైన ములుగు మండలంలోని జగ్గన్నపేటకు వచ్చిన సీతక్కకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తన ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను పుట్టిన పెరిగిన ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత తనపై ఉందన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ములుగులో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పారు. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌‌‌‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళిరెడ్డి,మార్కెట్‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌ మల్లాడి రాంరెడ్డి, ఉపసర్పంచ్‌‌‌‌ సదానందం పాల్గొన్నారు.