
- మార్పును అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ వర్సిటీని ఏర్పాటు చేస్తం
- గ్లోబల్ కేపిటల్ ఆఫ్ ఏఐగా తెలంగాణను తీర్చిదిద్దుతం
- దేశంలోనే తొలిసారిగా టీ హబ్లో తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండేండ్లలో 2 లక్షల మంది యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని టీ హబ్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ఏఐ అనుసంధానిత ‘తెలంగాణ డేటా ఎక్స్చేంజ్(టీజీడెక్స్)’ ను శ్రీధర్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి. కొత్తగా ఎన్నో అవకాశాలు సృష్టించింది. ఈ మార్పును అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని గ్లోబల్ కేపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. ఆ దిశగా ఇప్పటికే ఏఐ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించుకుని వడివడిగా అడుగులు వేస్తున్నది” అని చెప్పారు.
టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఏఐని ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకునేలా.. అనేక సమస్యలకు పరిష్కారం చూపించేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. “దీని రూపకల్పనలో బెంగళూరు ఐఐఎస్సీ వ్యూహాత్మక సహకారం అందించింది. ఇది దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ఏఐ డేటా ఎక్స్చేంజ్. ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువత అంతా ఒకే వేదికపైకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు దారి చూపుతుంది. ఇప్పటికే 480కి పైగా డేటాసెట్స్, 3 వేలకు పైగా ఏఐ స్టార్టప్స్ ఇందులో భాగస్వామయ్యాయి’’ అని చెప్పారు.
ఐదేండ్లలో 2వేల డేటా సెట్స్
టీజీ డెక్స్ లో రాబోయే ఐదేండ్లలో 2వేల డేటా సెట్స్ ను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. పాలనలో ఏఐ వినియోగానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో 30 ఏఐ ఆధారిత ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
పాఠశాలస్థాయి నుంచే నిపుణులను తయారు చేసేలా ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులమ్ ను రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్, ఐటీ సలహాదారు సాయి కృష్ణ, టీ హబ్ సీఈవో వికృత్, టీ వర్క్ సీఈవో జోగిందర్, జైకా ప్రతినిధులు టాకూచీ ఠాకూరో, యుషి నగానో తదితరులు పాల్గొన్నారు.
సాగు నుంచి ఆసుపత్రుల దాకా..
టీజీడెక్స్ ద్వారా వివిధ వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రైతులకు మేలు చేసే అగ్రిటెక్ స్టార్టప్స్కు డేటా లభిస్తుందన్నారు. రోగులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఆరోగ్య శాఖకు అవసరమైన ఏఐ మోడల్స్ అభివృద్ధి చేయొచ్చని, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడుతుందని వివరించారు. “గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేలా కొత్త ఆవిష్కరణలకు దిక్సూచిగా మారుతుంది.
పౌర సేవలను సమర్థవంతంగా ప్రజల ముంగిటకు చేర్చేందుకు ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే దగ్గర సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుంది” అని వివరించారు.