
- షీ జాబ్స్ రూపొందించిన ‘సీత’యాప్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: మహిళా సాధికారతను చేతల్లో చేసి చూపిస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ‘షీ జాబ్స్’ఆధ్వర్యంలో రూపొందించిన ‘సీత (SITHA – షీ ఈజ్ ది హీరో ఆల్వేస్)’యాప్ను సోమవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మహిళా సాధికారతకు మొదటి అడుగు ఇంటి నుంచే పడాలన్నారు.
కేంద్ర గణాంకాల శాఖ ‘భారత్లో పురుషులు, మహిళలు – 2024’పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో కుటుంబ నిర్ణయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 86 శాతం, పట్టణాల్లో 89 శాతం మంది మహిళలు భాగస్వామ్యమవుతున్నారని చెప్పారు. ఇవి అంకెలు కావని, మహిళా సాధికారతను సాకారం చేసేందుకు అడుగులు వేస్తున్న తెలంగాణ విజయగాథ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి మహిళలే పునాది అని, విద్య, ఉపాధి, నాయకత్వం, నిర్ణయాత్మక స్థానాల్లో ఎలాంటి వివక్ష లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
తాము ప్రారంభిస్తున్న ప్రతి పథకాన్ని మహిళల పేర్లపైనే ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘సీత’యాప్ నైపుణ్య మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేస్తున్న గ్రామీణ మహిళలకు ఇది గొప్ప మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. షీ జాబ్స్ నిర్వాహకురాలు స్వాతి నేలభట్ల మాట్లాడుతూ.. మహిళా గిగ్ వర్కర్లకు నైపుణ్య ఆధారిత సంపాదనా అవకాశాలను కల్పించి, వారు మరింత సాధికారత సాధించేలా మార్గనిర్దేశనం చేసేందుకే ‘సీత’యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఉద్యోగాలు చేసి గ్యాప్ వచ్చిన మహిళలు తమకు నచ్చిన రంగంలో ఉపాధి అవకాశాలు ఈ యాప్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి శ్రీలీల, డైరెక్టర్ హరీశ్ శంకర్, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.