
సోనియా గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అయితే.. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఇంకా విధి విధానాలు ఖారారు కాలేదని.. అమలు జరిగిన తర్వాత వచ్చే సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. ఆధార్ కార్డు ఉంటే చాలు.. మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించివచ్చని తెలిపారు.
డిసెంబర్ 7వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించామన్నారు. మార్పు కోసం ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పాయింట్స్:
- 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు అన్ని డిపార్ట్ మెంట్ల లో ఎంత ఖర్చు పెట్టారో పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులను కోరాం. ఈ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించాం.
- గ్యారెంటీల విషయంలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది.
- రేపు రెండు గ్యారంటీలపై చర్చిస్తాం. ప్రతి గ్యారంటీపై కేబినెట్ లో సుధీర్ఘంగా చర్చిస్తాం.
- మందుగా రాష్ట్రంలో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం
- సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9న ఆ రెండు గ్యారంటీలను అమలు చేస్తాం.
- రెండు గ్యారంటీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు రవాణా.. రెండోది రాజీవ్ ఆరోగ్య శ్రీ
- ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచుతున్నాం.
- రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతుంది.
- 2014 నుంచి పవర్ విషయంలో అనేక తప్పులు జరిగాయి. దీనిపై సుదీర్ఘంగా చర్చించాము.
- రేపు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు.
- రివ్యూ తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై నిర్ణయం తీసుకుంటాం.
- ఈనెల 9న అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది
- రైతు బంధుకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వివరాలు కోరాము.
- వివరాలు రాగానే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
- మంత్రి వర్గ కూర్పుపై ముఖ్యమంత్రి, మా పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుంది.