ఐటీ అధికారులకు మంత్రి శ్రీధర్​ బాబు హెచ్చరిక

ఐటీ అధికారులకు మంత్రి శ్రీధర్​ బాబు హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి శ్రీధర్​బాబు హెచ్చరించారు. గురువారం సెక్రటేరియెట్​లో ఐటీ, ఇండస్ట్రీస్, లెజిస్లేటివ్ ​ఎఫైర్స్​మినిస్టర్​గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఆయన రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయనే ప్రచారంపై మండిపడ్డారు. ఇదే విషయాన్ని ట్విట్టర్​లోనూ పోస్ట్​ చేశారు. ఐటీ కంపెనీలు, ఇతర పెట్టుబడులు హైదరాబాద్​నుంచి తరలిపోతున్నాయంటూ మీడియాకు లీకులు ఎలా ఇస్తారని ఐటీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్​ మీడియాలో ఇలాంటి తప్పుడు పోస్టింగ్​లను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.

 గడిచిన రెండ్రోజులుగా ‘కార్నింగ్స్’ అనే సంస్థ తెలంగాణను వీడి పోతున్నట్టుగా మీడియాలో వదంతులు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణను ఎలక్ట్రానిక్స్​ మ్యానుఫ్యాక్చరింగ్​ రంగంలో ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్ర వృద్ధిలో కార్నింగ్​ప్రధాన భాగస్వామిగా ఉందని, మహబూబ్ నగర్​జిల్లాలో ఎస్జీడీ ఫార్మాతో కలిసి ఆ సంస్థ గ్లాస్​ట్యూబింగ్​సంస్థను నెలకొల్పిందని తెలిపారు. కార్నింగ్​సంస్థ రాష్ట్రంలో తమ రెండో ప్రాజెక్టుగా గొరిల్లా కవర్ ​గ్లాస్ ​మ్యానుఫ్యాక్చరింగ్​ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. కార్నింగ్​సంస్థ తమ పెట్టుబడుల విస్తరణపై ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదని ఏ రాష్ట్రంతోనూ ఆ సంస్థ ఎంవోయూ కూడా చేసుకోలేదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కార్నింగ్​తో సంప్రదింపులు కొనసాగిస్తుందని, భవిష్యత్​లోనూ ఆ కంపెనీ ఇక్కడ తమ పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తోందని వెల్లడించారు.