పేదలకు ఇండ్లిచ్చింది నాడు వైఎస్.. నేడు రేవంత్రెడ్డి : మంత్రి శ్రీహరి

పేదలకు ఇండ్లిచ్చింది నాడు వైఎస్.. నేడు రేవంత్రెడ్డి : మంత్రి శ్రీహరి
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​చార్జి మంత్రి శ్రీహరి

భద్రాద్రికొత్తగూడెం/చంద్రుగొండ, వెలుగు : పేదలకు ఇండ్లిచ్చింది కాంగ్రెస్​ ప్రభుత్వానికి  చెందిన నాటి సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి, తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్​ రెడ్డి మాత్రమేనని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్​చార్జి మంత్రి వాకిడి శ్రీహరి అన్నారు. జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ప్రోగ్రామ్​లో సీఎంతో కలిసి ఆయన బుధవారం పాల్గొన్నారు. అనంతరం దామరచర్లలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 

వైఎస్సార్​ హయాంలో అర్హత ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లను, రేషన్​ కార్డులను ఇచ్చారన్నారు. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. గత బీఆర్​ఎస్​ పాలకులు డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల పేర ప్రజలను మోసం చేశారని, రేవంత్​రెడ్డి ఎన్నికల టైమ్​లో ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా ఎన్నో హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమంలో రాజీ పడడం లేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కుల గణన చేశామన్నారు. 

జీవితంలో మర్చిపోలేని రోజు : ఎమ్మెల్యే జారే 

తన నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టడం.. తన జీవితంలో మర్చిపోలేని రోజని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గంలో ఐదు గ్రామాలను పైలెట్​ ప్రాజెక్టుగా సెలెక్ట్​ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పని చేస్తున్నానన్నారు. 

పేదలందరికీ ఇండ్లు : ఎమ్మెల్యే కూనంనేని 

మరోసారి రేవంత్​ రెడ్డి సీఎం అయితే రాష్ట్రంలో పేదలందరికీ ఇండ్లు రావడం ఖాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. నిప్పు కణిక లాంటి రేవంత్​కు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గోదావరి నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలివ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో చిన్న చిన్న లోపాలున్నా అడ్జస్ట్​ చేసే విధంగా ఆదేశాలివ్వాలని సీఎంను కోరారు. 

ఖమ్మం, మహబూబాబాద్​ ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్​, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్​, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, రాందాస్​ నాయక్​, హౌసింగ్​ ఎండీ గౌతం, కలెక్టర్​ జితేష్​ వి పాటిల్, ఐజీ చంద్రశేఖర్​రెడ్డి, ఎస్పీ బి. రోహిత్​రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, అడిషనల్​కలెక్టర్​డి.వేణుగోపాల్​పాల్గొన్నారు.