గోడలపై పెయింటింగులు వేసుకునే రేవంత్ కి కోట్ల సంపాదన ఎలా వచ్చింది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

గోడలపై పెయింటింగులు వేసుకునే రేవంత్ కి కోట్ల సంపాదన ఎలా వచ్చింది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో గౌడ్ కులస్తులు ముందుకు వెళ్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఐదు నిమిషాల్లో గాల్లో కలిసిపోతారని అన్నారు. రాష్ట్రంలో బహుజనులు ఆర్థికంగా బలపడుతుంటే తట్టుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు కొంతమంది పెంపుడు కుక్కలను పెట్టుకుని తనపై ఆరోపణలు చేయిస్తున్నారంటూ ఆరోపించారు. గోడలపై పెయింటింగులు వేసుకునే రేవంత్ రెడ్డికి కోట్ల సంపాదన ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకుని చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ ద్వారా సంపాదించాడని ఆరోపించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పోలీసులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఒక్క హోంగార్డు తలుచుకుంటే ఆయన ఉండడు అని మాట్లాడారు. తనపై జరుగుతున్న కుట్రపూరిత దాడిపై బహుజన లోకం స్పందించాలని కోరారు. తనపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తితే వెంటాడి.. వేటాడాలన్నారు. తెలంగాణ రావడానికి ముఖ్యపాత్ర పోషించిన తనను వాడు, వీడు అంటుంటే గౌడ్ కులస్తులు నిద్ర పోతున్నారా..? అని ప్రశ్నించారు. తనపై దాడి అంటే బహుజనులపై దాడి జరిగినట్లేనని, ప్రతిఒక్క బహుజనుడు తనపై దాడిని తిప్పికొట్టాలని కోరారు. గౌడ కులస్తుల జాతి, పౌరుషం ఇంతేనా..? అని ప్రశ్నించారు. అందరం కట్టకట్టుకుని హుస్సేన్ సాగర్ లో దూకైనా చద్దాం కానీ.. ఈ అవమానాలు మనకొద్దు అంటూ చెప్పారు. ఎవరూ ముందుకురాకపోతే తానే సిద్ధమై.. పోరాడుతాననన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద తాను నమ్మి ఉండడం వల్లే అన్ని ఓర్చుకుంటున్నానని, వెనుక నుంచి పొడిచినా తట్టుకుంటున్నానని చెప్పారు.