పాలమూరు యూనివర్సిటీలో స్టూడెంట్ సూసైడ్

పాలమూరు యూనివర్సిటీలో స్టూడెంట్ సూసైడ్

మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో ఓ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్​నగర్​ రూరల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్​​ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన దుబ్బరి కార్తీక్(23) ఇంటర్​ పూర్తి చేసిన తర్వాత 2021లో పాలమూరు వర్సిటీలో ఇంటిగ్రేటెడ్  కెమిస్ట్రీ ఐదేళ్ల కోర్సులో జాయిన్​ అయ్యాడు. ఈ నెల 17న వైవా ఎగ్జామ్​ ఉండడంతో కార్తీక్​ ఎగ్జామ్స్​కు సంబంధించిన రికార్డ్స్​తో పాటు పరీక్ష రాయడానికి సమ్మర్​ హాలిడేస్​ అనంతరం సోమవారం రాత్రి 10 గంటలకు వర్సిటీకి వచ్చాడు. 

36వ నంబర్​లోని తన గదికి వెళ్లి అతని స్నేహితుడితో కలిసి నిద్రపోయాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన కార్తీక్​ 33వ నంబర్​ గదిలోకి వెళ్లి, ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్​కు బెడ్​ షీట్​తో ఉరేసుకున్నాడు. అతడిని అంబులెన్స్​లో మహబూబ్​నగర్​ జనరల్​ హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి​తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్​ కుమార్​ తెలిపారు. కాగా, మృతుడిది నిరుపేద కుటుంబ కావడంతో అంత్యక్రియలకు ఆర్థికసాయం చేయాలని వర్సిటీ వీసీ శ్రీనివాస్​ను కార్తీక్​ పేరెంట్స్​ కోరారు.