నాగర్ కర్నూల్ టౌన్/కోడేరు, వెలుగు : నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి తరలి వెళ్లిన నిర్వాసిత కుటుంబాలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారం గ్రామంలో నిర్వాసితుల కోసం 257 గృహాలు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించామని, ఆగస్టు 10వ తేదీలోగా ఇంటి నెంబర్లు, సర్వే నెంబర్లతో పత్రాలను అందించాలని అధికారులను ఆదేశించారు.
బాచారంలో రహదారులు, తాగునీరు, విద్యుత్తు, పారిశుధ్యం తదితర సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అనంతరం కోడేరు మండలంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. పస్పుల గ్రామంలో కొనసాగుతున్న సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత రైతు నేస్తం కార్యక్రమంతో పాటు పీహెచ్సీ కేంద్రం, కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
