జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట ఘటనపై కమిటీ

జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట ఘటనపై కమిటీ

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం విషయంలో HCA.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందే సంప్రదించి ఉంటే తొక్కిసలాట ఘటన జరిగేది కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత HCA తేరుకుని రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు కోరింది కాబట్టి అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కొంతమంది కావాలనే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తున్నారని, అలాచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జింఖానా గ్రౌండ్ లో గాయపడ్డవారికి అయ్యే వైద్య చికిత్స ఖర్చులను HCA భరిస్తుందని చెప్పారు. మ్యాచ్ నిర్వహణ కోసం.. అన్ని ప్రభుత్వ శాఖలను కో ఆర్డినేట్ చేసేందుకు.. ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశామని తెలిపారు. టిక్కెట్ల గోల్ మాల్, ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. 

క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాల సమయంలో తలెత్తిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో యువకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారని, అనుకోకుండా తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామన్నారు. HCA నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేస్తున్నామని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

ఈ నెల 25వ తేదీన భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. HCA ఎలాంటి కార్యక్రమం చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉంటుందన్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం వ్యవహారంలో హెచ్సీఏ తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, స్పోర్ట్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయాతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.