హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేప పిల్లల పంపిణీ చేశామని, భవిష్యత్తులో జాతీయ సాయిలో మంచినీటి చేపలు, రోయ్యల ఎగుమతిపై ఆలోచిస్తున్నామన్నారు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని పశు సంవర్ధక డైరెక్టర్ కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ రీజనల్ సబ్ సెంటర్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో చేపలకు, సముద్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని అన్నారు. త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో 150 డివిజన్లలో లైవ్ ఫిష్ ఔట్ లెట్లను పెట్టబోతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో చేపల ఉత్పత్తి బాగా వస్తుందని, మార్కెట్లను మరింత విస్తరిస్తామని చెప్పారు. రైతులకు ఆదాయం వచ్చే కోణంలో ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం చేపల విషయంలో 1:15 రేషియోలో లాభం ఉంటుందని, రాబోయో రోజుల్లో ప్రభుత్వమే మార్కెటింగ్ కు సహకారం అందిస్తుందని అన్నారు.