హైదరాబాద్: ఈ నెల 14 వ తేదీన ఉదయం 9.30 గంటలకు నగరంలో 26 బస్తీ దవాఖానల ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బస్తీ దవాఖానల ప్రారంభం ఏర్పాట్లపై మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం లో మంత్రి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో జీహెచ్ఎమ్సీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, 3 జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి KTR, హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్, డిప్యూటీ మేయర్ లు ఈ బస్తీ దవాఖానా లను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు
పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. జీహెచ్ఎమ్సీ పరిధిలో 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం 170 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.