సికింద్రాబాద్: లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా కట్టడి అయ్యే పరిస్థితి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. డాక్టర్ సలహా, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత వహించాలన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకొని కోవిడ్ బారిన పడకుండా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య విషయంలో అన్ని చర్యలు తీసుకుంటుందని ఎవరు ఆందోళన చెందొద్దని అన్నారు.
కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే.. ప్రభుత్వం ప్రకటించిన గాంధీ, నేచర్ క్యూర్, గచ్చిబౌలి తదితర ఆస్పత్రులల్లో పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. అనవసరంగా అన్నదానికి, లేనిదానికి టెస్టుల కోసం పోయి డబ్బులను..సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పేది పోయి..ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని తలసాని మండిపడ్డారు. ప్రయివేటు ఆసుపత్రులకు కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం పర్మిషన్ ఇస్తలేరని ప్రతిపక్షాలు లేని గగ్గోలు పెడితే ప్రభుత్వ నిబంధనలతో పర్మిషన్ ఇచ్చామన్నారు. తీరా ఇచ్చాక.. కరోనా రోగులను చేర్చుకునే పరిస్థితి లేదని, బెడ్స్..వెంటిలేటర్స్ లేవని, చేతులెత్తేస్తున్న పరిస్థితి అని వారు అనవసర కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కరోనా బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.