ఫిలిం చాంబర్ ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ

ఫిలిం చాంబర్ ప్రతినిధులతో మంత్రి తలసాని భేటీ

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 9 నుండి 22వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలలో విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే విధంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 

ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. అందులో భాగంగా విద్యార్ధులు అందరికీ మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్ధి దశ నుండే దేశభక్తిని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్ద్యంతో ఉన్న 563 స్క్రీన్స్ లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విద్యార్ధులను థియేటర్ లకు తీసుకెళ్ళే రవాణా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేపడుతుందని, అంతేకాకుండా వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించి సమీక్షించాలని హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రావిగుప్తాను మంత్రి ఆదేశించారు. 

ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు బసిరెడ్డి, FDC ED కిషోర్ బాబు, UFO, క్యూబ్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.