అన్ని జిల్లాల్లో చేపలు పట్టేవారికి ట్రైనింగ్ ఇస్తం : మంత్రి తలసాని

అన్ని జిల్లాల్లో చేపలు పట్టేవారికి ట్రైనింగ్ ఇస్తం : మంత్రి తలసాని

హైదరాబాద్ : గత 8 సంవత్సరాలుగా  మత్స్యశాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మారుతున్న టెక్నాలజీని అధికారులు, సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మత్స్యశాఖ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం నూతన మత్స్య సొసైటీల ఏర్పాటుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ నెల 6వ తేదీ నుండి ఏప్రిల్ 5 వరకు నూతన సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ ఫేస్ 2 నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఫేస్ 2లో 404 కొత్త సొసైటీలను ఏర్పాటు చేస్తామన్నారు. లక్షా 34 వేల 460 కొత్త సభ్యత్వాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గతంలో సభ్యత్వంలో ఉన్నవారు యాక్టివ్ గా ఉన్నారా..? లేదా అనే డాటా తీయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారులు సభ్యులై ఉండాలని చెప్పారు. మెంబర్ షిప్ డ్రైవ్ లో ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దని కోరారు. మూడు నెలల్లో లక్షా 35 వేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని జిల్లాల్లోనూ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. 

సభ్యత్వ నమోదులో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. జిల్లాల్లో మత్స్యకారులు కాకుండా ఇతర కమ్యూనిటీకి చెందిన వారికి కూడా సభ్యత్వం ఇవ్వాలని ఎవరైనా ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తీసుకువస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.