అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు

హైదరాబాద్: కృష్ణంరాజు మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నటుడు కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి... ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు మరణం చాలా బాధాకరమని అన్నారు. 56 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కృష్ణంరాజు... ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారని కొనియాడారు. భక్త కన్నప్ప సినిమాను చాలా సార్లు చూశానని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాల్లో కూడా కృష్ణంరాజు రాణించారని, కేంద్ర మంత్రిగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారని చెప్పారు.

ప్రభాస్ ఎదుగుదలలో కృష్ణంరాజు పాత్ర చాలా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహా ప్రస్థానంలో రేపు కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.