అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్

అక్టోబర్  నుంచి కొత్త రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్
  • హెల్త్​ కార్డులకూ అప్లికేషన్లు.. అదే నెలలో లబ్ధిదారుల ఎంపిక
  • పార్టీలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ
  • ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరుపై స్టడీ
  • ఈ నెల 21న మరోసారి సబ్​ కమిటీ భేటీ
  • రేషన్, హెల్త్​ కార్డులకు గైడ్​లైన్స్​ పూర్తి
  • ఈ వానాకాలం పంట నుంచే సన్న వడ్లకు బోనస్​
  • జనవరి నుంచి రేషన్​పై సన్నబియ్యం పంపిణీ
  • వివరాలు వెల్లడించిన సివిల్​ సప్లై మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలోనే కొత్త రేషన్​ కార్డులు, హెల్త్​కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అర్హులైన  ప్రతి కుటుంబానికి హెల్త్​ కార్డులు, కొత్త రేషన్​కార్డుల కోసం ప్రత్యేకంగా అప్లికేషన్లు సేకరించి, లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అర్హులైనవారందరికీ స్మార్ట్​ కార్డులు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా విధివిధానాలు రూపొందించేందుకు సివిల్​ సప్లయ్స్​మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అధ్యక్షతన సోమవారం కేబినెట్​సబ్​కమిటీ భేటీ అయింది. ఇప్పటికే సబ్ కమిటీ  రాజకీయ పార్టీలకు లెటర్లు రాసి అభిప్రాయాలను చెప్పాలని కోరింది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర 15 మంది ప్రజాప్రతినిధులు కమిటీకి లిఖిత పూర్వకంగా అభిప్రాయాలను పంపించారు. 

ఇతర రాష్ట్రాల్లో రేషన్​కార్డుల కోసం అమలు చేస్తున్న విధానాలు, ప్రజాప్రతినిధులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన  అభిప్రాయాలపై సోమవారం జరిగిన కేబినెట్​ సబ్​కమిటీ భేటీలో ఓవరాల్​గా చర్చ జరిగింది.  ఈ నెల 21న మరోసారి సబ్​ కమిటీ భేటీ అయి స్పష్టమైన విధివిధానాలపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేసుకుని అక్టోబర్​ నెలలో రేషన్​కార్డుల అప్లికేషన్లు స్వీకరించడంతోపాటు స్మార్ట్​కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తమ్​కుమార్​రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్​సబ్​కమిటీ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, దామోదర రాజనర్సింహ, సివిల్​ సప్లయ్స్ కమిషనర్, హెల్త్​ డిపార్ట్​మెంట్​ సెక్రటరీ, అధికారులు పాల్గొన్నారు. 

అర్హులందరికీ రేషన్ కార్డులు: ఉత్తమ్​

అర్హులందరికీ వేగవంతంగా రేషన్​కార్డులు ఇవ్వబోతున్నామని సివిల్​ సప్లయ్స్​మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రకటించారు.  కేబినెట్​సబ్​ కమిటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్​ నెలలో అప్లికేషన్ ​తీసుకుని, అర్హులను ఎంపిక చేసి, రేషన్​ కార్డులు జారీచేస్తామని ప్రకటించారు. ‘‘రేషన్​ కార్డుల విధివిధానాల కోసమే భేటీ జరిగింది. మరోసారి భేటీ అయి విధివిధానాలపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాం. పూర్తి ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో  ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లెటర్​రాశాం. ఇప్పుడున్న పద్ధతితోపాటు కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టాలనే దానిపై ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా కోరాం. చేవెళ్ల , హైదరాబాద్, పెద్దపల్లి ఎంపీలు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

ఎల్బీనగర్, మల్కాజ్​గిరి, ఆర్మూర్, ఖానాపూర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  కౌన్సిల్​ చైర్మన్​ డిప్యూటీ చైర్మన్లు అభిప్రాయాలు తెలిపారు. ఎంఐఎం పార్టీ అఫీషియల్​గా రిప్లయ్​ ఇచ్చింది. ఈ నెల 19లోగా అభిప్రాయాలు చెప్పాలని మరోమారు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం”  అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అందించే రిప్రజంటేషన్లను కమిటీలో పొందుపరుస్తామని తెలిపారు. 

బీఆర్ఎస్​ హయాంలో ఇచ్చింది కేవలం 49,476 కార్డులే..

గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో ఇచ్చింది కేవలం 49,476 రేషన్​కార్డులు మాత్రమేనని ఉత్తమ్ కుమార్​రెడ్డి  తెలిపారు. అది కూడా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోనే ఇచ్చారని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్​ కార్డులు ఉండగా.. 2 కోట్ల 84 లక్షల70 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఉన్న రేషన్​ కార్డుల్లో సెంట్రల్​ గవర్నమెంట్​కింద 54.45 లక్షల కార్డులు ఉండగా.. 1.91 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్​ బియ్య ఇస్తుండగా ఇందులో 5 కేజీల చొప్పున కేంద్రం.. కిలో చొప్పున రాష్ట్రం భరిస్తుంది. అంతే కాకుండా మరో 35.51 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండగా.. 93 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 

వీరికి  6 కిలోల చొప్పున పూర్తిస్థాయిలో రాష్ట్రం ప్రభుత్వం రేషన్​ అందిస్తున్నది” అని ఉత్తమ్ వివరించారు. అలాగే, అంత్యోదయ స్కీమ్​కింద 5.66 లక్షల కార్డులు ఉండగా, వీరికి కేంద్రం నుంచి నెలకు 35 కిలోల బియ్యం అందిస్తున్నట్టు చెప్పారు. వీటికి అదనంగా సెంట్రల్​స్కీమ్​హెచ్ఐవీ పాజిటివ్​తదితర మరో 5,416 కార్డులు ఉన్నాయని, పెన్షన్​ రాని  లబ్ధిదారులకు  నెలకు 10 కిలోల బియ్యం అందిస్తారని వివరించారు. 

సన్న వడ్లకు రూ.500 బోనస్​

 రాష్ట్రంలోని రైతులకు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ వానాకాలం సీజన్​ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్​ ఇస్తున్నట్టు ప్రకటించారు. జనవరి నుంచే  రేషన్​లో సన్నబియ్యం అందిస్తామని స్పష్టం చేశారు.  రాష్ట్రవాప్తంగా ఉన్న రేషన్​ లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. గతంలో  ఇచ్చిన బియ్యం లబ్ధిదారులు తినకపోవడంతో మిస్​ యూజ్​ అయ్యాయని అన్నారు. అందుకే సన్నబియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

రేషన్​కార్డుల జారీకి  విస్తృత అధ్యయనం

‘‘గతంలో ఏ విధానంలో రేషన్​ కార్డులు ఇచ్చారు? తాము ఎలా ఇవ్వాలి? అనే దానిపై విస్తృత అధ్యయం చేస్తున్నాం” అని ఉత్తమ్​ తెలిపారు.  ‘‘గతంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో  రూ.1.50 లక్షలు, అర్బన్​లో రూ. 2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. వ్యవసాయ భూమి పొలం అయితే  3.5 లక్షల ఎకరాలు, చెలక అయితే ఏడున్నర ఎకరాలు ఉండాలని రూల్స్​ఉన్నయ్.  పక్క రాష్ట్రం ఏపీలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రేషన్​ లబ్ధిదారులకు 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షల ఆదాయ పరిమితి ఉంది.

 కర్ణాటకలో  1.20 లక్షల కంటే తక్కువ, తమిళనాడులో లక్ష కంటే తక్కువ, గుజరాత్​లో 1.20 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలనే నిబంధనలు అమలవుతున్నాయి.  ప్రస్తుతం ఉన్న నిబంధనలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న రూల్స్​ను పరిశీలించి కొత్త రేషన్ కార్డుల నిబంధనలు రూపొందిస్తాం’ అని ఉత్తమ్​పేర్కొన్నారు. దీనిపై తదుపరి కేబినెట్ భేటీలో ఓ క్లారిటీ వస్తుందని వెల్లడించారు.