
వనపర్తి/మదనాపురం, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో అన్ని సౌలతులు కల్పిస్తున్నామని, ఫలితాల కోసం టీచర్లు పకడ్బందీగా పని చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం అమరచింత జడ్పీ హైస్కూల్లో రూ.20 లక్షలతో నిర్మించిన అడిషనల్ క్లాస్ రూమ్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో కన్నా విద్యార్హతలు ఎక్కువ ఉన్న టీచర్లు గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారని, స్టూడెంట్లకు ఫ్రీ యూనిఫాం, బుక్స్, మధ్యాహ్న భోజనం ఇస్తున్నామని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకు పంపించాలన్నారు. కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేలా టీచర్లు తమవంతు కృషి చేయాలని కోరారు. పిల్లల చదువు విషయంలో టీచర్లు నిర్లక్ష్యం చేస్తే సహించబోమన్నారు. అనంతరం సింగంపేట గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించిన అంగన్వాడీ బిల్డింగ్ను మంత్రి ప్రారంభించారు.
అంతకుముందు మదనాపురం మండలం గోపన్ పేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడంతో సరిపెట్టకుండా, వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. రాజ్యాంగం ద్వారానే బీసీల రిజర్వేషన్ల అమలు సాధ్యమైందని తెలిపారు. కల్లుగీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్, మాజీ సర్పంచ్ వెంకటేశ్, బషీర్, ఆంజనేయులు గౌడ్, కొండన్న, శ్రీనివాసులు, రామాంజనేయులు పాల్గొన్నారు.