జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి

జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం ఆదర్శం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం
  • హైదరాబాద్​​ అభివృద్ధిలో జైపాల్​ పాత్ర ఎంతో ఉంది
  • మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి 
  • జైపాల్​రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రులు, ప్రముఖులు

హైద్రాబాద్ : మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్​ దివంగత జైపాల్​రెడ్డి రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శమని కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. జైపాల్​రెడ్డి వర్ధంతి సందర్భంగా పీవీఎన్ ఆర్ మార్గ్​లోని జైపాల్​రెడ్డి స్మారకం స్తూపం స్ఫూర్తి స్థల్ వద్ద  ఈ రోజు మంత్రులు, ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రి వివేక్​ వెంకటస్వామి కూడా పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడి నుంచి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారన్నారు. 

ఆయన నిరంతరం డెమోక్రసి గురించి కొట్లాడారని, ప్రజల సమస్యలపై పార్లమెంట్​లో ఆయన పోరాటం చేసిన తీరు గొప్పదన్నారు.  తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన తమకు సలహాలు అందించారన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఒత్తిడిలో కూడా విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు.  మంత్రులు పొన్నం ప్రభాకర్​, కోమటిరెడ్డి వెంకట్​డ్డి మాట్లాడుతూ తాము కొత్తగా పార్లమెంట్​లో అడుగు పెట్టినప్పుడు జైపాల్​రెడ్డి వద్ద పార్లమెంటరీ విధానం గురించి తెలుసుకున్నామన్నారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ఆయన ఎంపీలకు సలహాలిచ్చే వారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. హైదరాబాద్​కు మెట్రోతో పాటు ఇతర ప్రాజెక్టులను అందించి అభివృద్ధి చేసిన ఘనత ఆయనదే అన్నారు.  

మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ స్పూర్తిస్థల్​ వద్ద నివాళులర్పించి మాట్లాడారు. జైపాల్​రెడ్డి నాయకుడు మాత్రమే కాదు మంచి విమర్శకుడు కూడా అన్నారు. కేంద్ర మంత్రిగా మంచి విలువలతో కూడిన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. అవినీతిని సహించని వ్యక్తి జైపాల్ రెడ్డి అన్నారు.