
పీవీ ఆర్థిక సంస్కరణల పితామహుడని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోని భారతీయ విద్య భవన్ లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రక్తదానం చేసిన దాతలకు సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి పీవీ సేవలను కొనియాడారు. వేల ఎకరాల భూమిని పేదలకు పంచిన మహానుభావుడన్నారు. పీవీ మంచి నాయకుడు దేశానికి ప్రధానిగా చేసి గొప్ప పేరు తెచ్చుకున్నారని చెప్పారు.
తన తండ్రి కాకా వెంకటస్వామి ట్రేడ్ యూనియన్ లీడర్ గా ఉన్నపుడు పీవీ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు మంత్రి వివేక్. ఆ రోజుల్లో పీవీ దేశం కోసం చాలా సేవలు చేశారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో పీవీ నరసింహారావు సేవలు చేశారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యను అందించిన ఘనత పీవీ నరసింహారావుదేనన్నారు. పీవీ నరసింహారావు పుస్తకాలు అందరూ చదవాలని సూచించారు వివేక్. పీవీ నరసింహారావు పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి రక్త దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు మంత్రి వివేక్.