మహిళలు వ్యాపార రంగంలోకి ముందుకు రావాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఇందిరమ్మ అందరికి ఇన్సిపిరేషన్.. అందుకే ఆమె పేరు మీద చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల రుపాయల బతుకమ్మ చీర ఇచ్చిందని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం సిరిసిల్లలో తయారు చేసిన రూ. 800 చీరను ఇస్తుందన్నారు.
తన నాన్న చదువు పూర్తయిన తరువాత 5 లక్షల రూపాయలు ఇస్తే... దాన్ని ఇప్పుడు రెండు వేల కోట్ల బిజినెస్ గా మార్చాని వివేక్ చెప్పారు. తమ కంపెనీ ఎప్పుడు బ్యాంకర్ ని ఇబ్బంది పెట్టలేదన్నారు. డిఫాల్ట్ చేయకపోవడం వల్ల నాకు ఎప్పుడంటే అప్పుడు లోన్ లు ఇస్తారని చెప్పారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పావలా వడ్డి రుణాలు ఇప్పించారు.. అదే ఆలోచనతో రేవంత్ రెడ్డి వడ్డి లేని రుణాలు ఇస్తున్నారని తెలిపారు వివేక్.
ఇప్పటికే దుబ్బాకలో ఆరు కోట్ల రుణాలు తీసుకున్నారంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. కష్టపడి పని చేయాలని.. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారని తెలిపారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా 12 వేల కోట్లతో సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇండ్లు కట్టాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు వివేక్.
