మైనార్టీలకు పదవులిస్తే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వట్లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి

మైనార్టీలకు పదవులిస్తే  బీఆర్ఎస్, బీజేపీ ఓర్వట్లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • జూబ్లీహిల్స్‌‌లో ఆ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నయ్: మంత్రి వివేక్ వెంకటస్వామి 
  • పదేండ్ల పాలనలో ఎంతమంది ముస్లింలకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చింది? 
  • కాంగ్రెస్ సర్కార్‌‌‌‌లో 17 మందికి చైర్మన్ పదవులు ఇచ్చాం
  • ఇప్పుడు అజారుద్దీన్‌‌కుమంత్రి పదవి ఇస్తున్నామని వెల్లడి

జూబ్లీహిల్స్, వెలుగు: ముస్లిం మైనార్టీలకు పదవులిస్తే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. జూబ్లీహిల్స్​ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్నాయని అన్నారు. బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గురువారం షేక్‌‌పేటలో ముస్లిం మైనారిటీ నాయకులతో, రాయల్ రెసిడెన్సీ, సూర్యనగర్ కాలనీల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడం బీఆర్ఎస్‌‌కు నచ్చడం లేదని ఫైర్ అయ్యారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది ముస్లింలకు పదవులు ఇచ్చారో చెప్పాలని కేటీఆర్‌‌‌‌ను ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 17  మంది ముస్లిం నేతలకు రాష్ట్ర చైర్మన్ పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించాం. 

ఉమ్మడి ఏపీలో  కూడా ఇంతమంది ముస్లిం మైనార్టీలకు పదవులు ఇవ్వలేదు. ఇప్పుడు అజారుద్దీన్‌‌కు మంత్రి పదవి ఇస్తున్నాం” అని తెలిపారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో మహమూద్ అలీకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. కానీ ఆనాడు కేసీఆర్, కేటీఆర్ చేతుల్లోనే అధికారం పెట్టుకున్నారు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితిని ముస్లిం నేతకు కల్పించారు. 

ఇప్పుడు కాంగ్రెస్‌‌లో అలాంటి పరిస్థితి లేదు. మంత్రులందరూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు” అని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్‌‌లో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో  రూ.240 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.  

గంగపుత్రుల సమస్యలు పరిష్కరిస్తం.. 

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకుంటుందని మంత్రి వివేక్ అన్నారు. గంగపుత్రుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గురువారం షేక్‌‌పేటలో గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపుత్రుల కోసం జూబ్లీహిల్స్‌‌లో కమ్యూనిటీ హాల్​నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మత్స్యశాఖకు 40 కోట్లు కేటాయించి, కేవలం 4 కోట్లే ఖర్చు చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. 26 వేల చెరువుల్లో చేప పిల్లలు, 300  చెరువుల్లో రొయ్యలు వదులుతామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మంత్రుల ఇంటింటి ప్రచారం..  

జూబ్లీహిల్స్‌‌లో గురువారం పలువురు మంత్రులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎర్రగడ్డలో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌తో కలిసి మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ప్రచారంలో పాల్గొన్నారు. ఇక కృష్ణానగర్‌‌‌‌లో నవీన్ యాదవ్‌‌తో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ దగ్గర ఆగి.. స్థానికులతో ముచ్చటించారు.