
ఎవరికి ఏ శాఖ కేటాయించాలనేది సీఎం నిర్ణయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన..మంత్రులకు శాఖల కేటాయింపు పై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపుతున్నారని చెప్పారు. మరో రెండు రోజుల్లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తవుతుందన్నారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎస్సీ, బీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని చెప్పారు మంత్రి వివేక్.
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఇంటిగ్రెటెడ్ పాఠశాలు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుంది. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పేదల సంక్షేమన్ని పట్టించుకోలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ హడావిడి చేసిందే తప్ప ప్రజలకు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు సూచించారు . స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలని ఖర్గే,కేసి వేణుగోపాల్ సూచించారు. పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలకు తెలియజేయాలని ఖర్గే సూచించారని వివేక్ అన్నారు.
నా తండ్రి కాకాకు గతంలో రూరల్ డెవలప్మెంట్ శాఖ కేటాయిస్తే.. రూ. 5 వేల కోట్ల బడ్జెట్ ఉన్న చిన్న శాఖ అని అందరూ కామెంట్ చేశారు. కానీ ఆ శాఖ బడ్జెట్ను రూ. 5 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కార్మిక శాఖ మంత్రిగా బొగ్గు గని కార్మికులకు పెన్షన్లు ఇప్పించారు. సింగరేణి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో మాట్లాడి సంస్థను కాపాడారు. నేను కూడా నా తండ్రి అడుగుజాడల్లో నడిచి.. ఎంపీగా ఉన్నప్పుడు మూతపడ్డ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించాను. ఇందుకోసం నాటి ప్రధాని మన్మోహన్తో మాట్లాడి రూ. 10 వేల కోట్ల రుణమాఫీ చేయించాను. అలా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలకు ఏం చేశామన్నదే మాకు ముఖ్యం” అని అన్నారు వివేక్
►ALSO READ | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
వివేక్ వెంకటస్వామి జూన్ 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న వివేక్ జూన్ 9న మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇవాళ ఎంపీ వంశీకృష్ణతో కలిసి సీఎం రేవంత్ ను కలిశారు. మంత్రి వర్గంలో చోటు కల్పించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.